శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు ; నిత్య కళారాధన భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు
దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (23.06.2022) ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.
ప్రతి గురువారం దేవస్థాన సేవగా సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది.
ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి. .

లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.
కాగా శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.
కాగా దత్తాత్రేయస్వామివారు. కలియుగంలో గోదావరి తీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో చెప్పబడింది.
కాగా శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్ధ క్షేత్రాల మహిమా విశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు. శ్రీపాదవల్లభుల జన్మ తరువాత మహారాష్ట్రలోని కరంజినగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించారు. వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురుచరిత్ర చెబుతోంది.
నృసింహసరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగలోనే చేశారు. కలియుగ ప్రభావం రోజు రోజుకు ఎక్కువకావడముతో, నృసింహసరస్వతీస్వామి అదృశ్యరూపములో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దాంతో భౌతికదేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు.
శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహసరస్వతి స్వామివారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చోని, కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ఆ అరటి ఆకులపైనే పయనిస్తూ, అదృశ్యమైనట్లు గురుచరిత్ర చెబుతోంది.
ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు
సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (23.06.2022) శ్రీ వాగ్గేవి నృత్యనికేతన్, కాకినాడ వారిచే ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం నిర్వహించబడింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య, కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమములో శివాష్టకం, త్రిపురసంహారం, అర్ధనారీశ్వరం, శ్రీశైల శంకరా గంగాధరా, శంభో శిహోహం, మహిషాసురమర్దిని, దశావతారాలు, తదితర అంశాలకు గీతిక, సంజన, ప్రణతి నందన, జ్యోతి, లక్షిత, గీతిక, నిహిత, మోదిత శ్రీజ, జయశ్రీ, ఉమా మహేశ్వరి, లతిక తదితరులు, నృత్య ప్రదర్శన చేసారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు
రేపు (24.06.2022) శ్రీ డా. శ్రీధర్ మరియు వారి బృందం హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.